
సూర్య ఉదయం ప్రతినిధి సైబరాబాద్
రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా పండుగను ప్రశాంతంగా, పరిశుభ్రంగా నిర్వహించేందుకు సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ ఆధ్వర్యంలో సీఎంసీ, రెవెన్యూ, వెటర్నరీ శాఖ అధికారులతో మంగళవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ పోలీస్ అధికారులు, ఎస్హెచ్వోలు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా పరిశుభ్రత, ప్రజారోగ్యం, జంతు వ్యర్థాల సక్రమ నిర్వహణపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈద్గాహ్లు, మసీదులు మరియు నివాస ప్రాంతాల వద్ద జంతు వ్యర్థాల సేకరణ కోసం మందమైన నల్ల పాలిథిన్ కవర్లు అందుబాటులో ఉంచడం, వ్యర్థాల తరలింపుకు తగిన వాహనాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై అధికారులు చర్చించారు. అలాగే రోడ్లు, ప్రజా ప్రదేశాల శుభ్రత కోసం తగినన్ని వాటర్ ట్యాంకర్లు, పారిశుధ్య సిబ్బందిని నియమించడం, అవసరమైన చోట్ల బ్లీచింగ్ పౌడర్ వినియోగించడం ద్వారా దుర్వాసన నివారణతో పాటు పరిశుభ్రతను కాపాడాలని సూచించారు.
సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్, ఐపీఎస్ మాట్లాడుతూ,* బక్రీద్ పండుగను ప్రజలందరూ ప్రశాంతంగా, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. పండుగ సందర్భంగా పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఈద్గాహ్లు, మసీదులు, నివాస ప్రాంతాల వద్ద జంతు వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా అధికారులు సూచించిన విధంగా పాలిథిన్ కవర్లలో సేకరించాలని తెలిపారు. వ్యర్థాల తొలగింపు, రోడ్ల శుభ్రత, పారిశుధ్య నిర్వహణ కోసం సీఎంసీ, రెవెన్యూ, వెటర్నరీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని చూసించారు.
పండుగ సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్య సిబ్బంది, వాటర్ ట్యాంకర్లు, వ్యర్థాల తరలింపు వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అవసరమైన చోట్ల బ్లీచింగ్ పౌడర్ వినియోగించి పరిశుభ్రతను కాపాడాలని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రజలు కూడా పోలీసులకు, సంబంధిత శాఖల అధికారులకు సహకరించి పరిశుభ్రత, ప్రజారోగ్యం, సామరస్య వాతావరణాన్ని కాపాడాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశం లో ఎస్ బి డీసీపీ సుధీంద్ర, క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయి మనోహర్, సీ ఏ ఆర్ హెడ్ క్వార్టర్ డీసీపీ సంజీవ్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Recent Comments