సూర్య ఉదయం ప్రతినిధి (రాజంపేట, నవంబర్ 19 )జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని గీతాంజలి విద్యాసంస్థల చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్వీ రమణ అన్నారు. బుధవారం రాజంపేట లోని గీతాంజలి డిగ్రీ కళాశాలలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ జాప్ 33 వ వ్యవస్థాపక దినోత్సవం రాష్ట్ర సీనియర్ నాయకులు గుండ్రాతి విజయ్ కుమార్ సభాధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా

ఉంటూ సమాజానికి మార్గదర్శకులుగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా అందరి సమస్యలు పరిష్కరించే జర్నలిస్టులు వారి యొక్క సమస్యలను ప్రభుత్వాలు గుర్తించి వారికి అందరిలాగా తగిన న్యాయం చేసి వారిని ఆదుకోవాలని అన్నారు. వారికి ఇండ్ల స్థలాలు, అక్రిడేషన్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా గతంలో నేను కూడా ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో పాత్రికేయునిగా పనిచేసిన అనుభవం ఉన్నందువలన వారి యొక్క సమస్యలు నాకు బాగా తెలుసు అని ఆయన తెలిపారు. అలాగే పత్రికల్లో ప్రచురితమయ్యే వార్తలు వలన ప్రజలు తెలుసుకొని వాటినే ప్రామాణికంగా తీసుకొని నమ్మే పరిస్థితి ఉన్నదని కావున వీరికి ప్రభుత్వం అన్ని విషయాలలో గుర్తించి వీరినీ ప్రోత్సహించాలని ఆయన తెలిపారు. అనంతరం జాప్ సీనియర్ నాయకుడు గుండ్రాతి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ జర్నలిస్టుల సమస్యలను తీర్చడంలో విఫలమవుతున్నారని వారికి సరైన గుర్తింపు లేనీ విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా సీనియర్ జర్నలిస్ట్ పీవీ సుబ్బయ్యను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాప్ సీనియర్ నాయకుడు నాగేండ్ల. వెంకటసుబ్బారెడ్డి, జ్యోతి జార్జ్, ఎల్ వినయ్ కుమార్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు వై.వి రమణ, ప్రసాద్, రాజేంద్ర కుమార్, ఈశ్వరయ్య, వివిధ మండలాల నుంచి విచ్చేసిన జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Recent Comments