సూర్య ఉదయం ప్రతినిధి, కూకట్పల్లి:

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతం దిశగా పలువురు ప్రముఖులు ఆదివారం ఆ పార్టీలో చేరారు. GHMC, CMC, MMC పరిధికి చెందిన పలువురు నాయకులు, ప్రముఖులు జనసేన పార్టీలో సభ్యత్వం పొందారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పార్టీ కండువాలు కప్పి నూతనంగా చేరిన వారిని సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరిన వారిలో వికారాబాద్కు చెందిన న్యాయవాది సి. జగదీష్ ఉన్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ వికారాబాద్ జిల్లా కార్యదర్శిగా సేవలందించారు. అలాగే హయత్నగర్కు చెందిన డా. రాజశేఖర్, డా. అనసూయ, శైలజ, లంగర్హౌస్కు చెందిన న్యాయవాది కే. రత్నారావు, మెహిదీపట్నంకు చెందిన ఎస్. రాజు జనసేన పార్టీలో చేరారు. తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు ప్రముఖులు పార్టీలో చేరడం పట్ల జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మరింత విస్తృతంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్.కె. నాయుడు, రాష్ట్ర నాయకులు రాధారం రాజలింగం, మచ్చ సుధాకర్, మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, మీసాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.